సీఎం జగన్ నేతృత్వంలో ఏర్పాటైన అసెంబ్లీలో రెండో రోజే ప్రతిపక్షం టీడీపీ సభ్యులకు దిమ్మతిరిగిపోయింది. రెండో రో జు సభాపతిని ఎన్నుకునేందుకు సమయం కేటాయించారు. సభాపతిగా సుదీర్గ అనుభవం ఉన్న ఆముదాలవలస ఎమ్మె ల్యే తమ్మినేని సీతారాంను ఎన్నుకొన్నారు. ఈ క్రమంలో ఆయనను సభాపతి స్థానంలోకి తీసుకువెళ్లి కూర్చోబెట్టే క్రమంలో సభానేత, ప్రతిపక్ష నేత వెంట ఉండి స్పీకర్ను తోడ్కొని వెళ్లి ఆయన స్థానంలో కూర్చొబెట్టడం అనేది సంప్రదాయంగా వస్తున్న విషయం. అయితే, ఏపీ అసెంబ్లీలో రెండో రోజు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్ర బాబు.. స్పీకర్ ను తోడ్కొని వెళ్లడంలో ముందుకు రాకుండా ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అచ్చన్నాయుడును పంపించారు.
అయితే, ఈ విషయం తీవ్ర వివాదానికి కారణమైంది. తొలుత ఈ విషయాన్ని సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబా బు.. లేవనెత్తారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు బీసీ వర్గానికి చెందిన స్పీకర్ను తోడ్కొని వెళ్లేందుకు ముందుకు రాలేదని విమర్శించారు. దీనికి కొనసాగింపుగా.. అధికార పార్టీ సభ్యులు తమ వ్యాఖ్యలు సంధించారు. ఈ క్రమంలోనే చంద్రగిరి నుంచి గెలిచిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు రాకుండా బంట్రోతును పంపించారు! అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్క సారిగా సభలో కలకలం రేగింది. ఇక, ఇదే విషయం దాదాపు అరగంటపాటు సభను ఊపేసింది.
తనను బంట్రోతు అన్న చెవిరెడ్డి.. క్షమాపణ చెప్పాలని అచ్చన్నాయుడు, టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఇది వివాదానికి కారణమైంది. ఇదే విషయంపై చంద్రబాబు కూడా క్షమాపణలు చెప్పాలని కోరడంతో అధికార పార్టీ తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో వైసీపీ సభ్యుల పట్ల టీడీపీ నేతలు అనుసరించిన విధానాలను ఒక్కొక్కరుగా ఏకరువు పెట్టారు. ఈ క్రమంలోనే గతంలో వైఎస్ ను విమర్శించిన నాయకులు ఇప్పుడు క్షమాపణలు చెబితే.. తాము కూడా సిద్ధమని చెప్పడంలో ప్రతిపక్ష్ంలోని నాయకులు మౌనం పాటించాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సభలో హోరు, జోరు పెంచాయనడంలో సందేహంలేదు. ఆదిలోనే టీడీపీ నాయకులు ఎదురు దాడి చేయడంలో విఫలమయ్యారనే విషయం కూడా స్పష్టమైంది.