చింత చచ్చినా.. పులుపు చావదన్నట్టుగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు. తాజాగా ఆయన అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలే దీనికి తార్కాణంగా నిలుస్తున్నాయి. గత సభపై అధికార పార్టీ సభ్యులు చేస్తున్న విమర్శలకు.. ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్న చంద్రబాబు.. లేని ఆవేశాన్ని తెచ్చి పెట్టుకున్నారు. తాను తగ్గేదిలేదని, పోరాటాలు చేస్తామని ప్రకటించి మరింత పలుచనయ్యారు. తాజాగా కొలువుదీరిన సభలో స్పీకర్ను ఎన్నుకొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించారు.
అసెంబ్లీ సంప్రదాయాలకు పెద్దపీట వేయాలని, పార్టీ మారే సభ్యులపై వేటు వేయాలని, ఈ విషయంలో తాను కూడా జోక్యం చేసుకోబోనని, అసెంబ్లీ స్పీకర్గా పూర్తిస్థాయిలో అధికారాలను వినియోగించుకోవాలని జగన్ సూచించారు. అనంతరం, ప్రతిపక్ష నాయకుడి హోదాలో చంద్రబాబు ప్రసంగించారు. అయితే, ఈ సమయంలో ఆయన టేబుల్పై ఉన్న స్పీకర్ సౌండ్ పెరగడంతో.. అధికార పక్షం సభ్యులు బల్లలపై చరుస్తూ.. హంగామా సృష్టించారు. మీ హయాంలో ప్రతిపక్షం సభ్యుల స్పీకర్లు.. పనిచేయలేదు. కానీ, మేం అధికారంలోకి వచ్చాక.. రీసౌండ్తో పనిచేస్తున్నాయని అన్నారు.
ఈ విషయంపై హుందాగా స్పందించాల్సిన చంద్రబాబు తన మనసులోని మాటను బయట పెట్టుకున్నారు. నేను తగ్గేది లేదు. మరింత అరుస్తా.. మరింతగా మాటలు వస్తాయి. పోరాటం ఆగదంటూ ఆయన వ్యాఖ్యానించి.. తర్వాత స్పీకర్కు అభినందన తీర్మానం చదివారు. అయితే, ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపాయి. మూడు సార్లు విపక్ష నేతగా మూడు సార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు సభలో ఇలా వ్యాఖ్యానించడం సరికాదని, కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై విరుచుకుపడడం వల్ల ప్రయోజనం ఉండదని అంటున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించినప్పుడే బాబుకు హుందాతనం ఉంటుందని అంటున్నారు.