ఏపీ సీఎం చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో మాటమాటకు తనకు లక్షలాది మంది చెల్లెమ్మలు ఉన్నారని... వారి దీవెనలతో తాను తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పుకున్నారు. కానీ ఐదేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు మహిళలను ఎంత ఇబ్బంది పెట్టారో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. డ్వాక్రా రుణాల విషయంలో మహిళలకు ఆశ పెట్టి ఆయన చేసిన మోసం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆశా కార్యకర్తలు జీతాలు పెంచాలని చంద్రబాబును కోరితే వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 3000 గా ఉన్న ఆశ వర్కర్ల జీతాలను ఏకంగా రూ. 10 వేలకు పెంచి సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు మహిళలకు మరో అదిరిపోయే వరాన్ని జగన్ ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు పరిపాలన మరింత దగ్గర చేసేందుకు జగన్ గ్రామస్థాయిలో వలంటీర్లను నియమిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరువయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా 4.3 లక్షల వలంటీర్ల నియామకానికి రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ 4.3 లక్షల మంది గ్రామ వలంటీర్ల పోస్టులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ సంచలన ప్రకటన చేశారు. దీనిని బట్టి మహిళలకు ఏకంగా 2.165 లక్షల పోస్టు దక్కనున్నాయి. విద్యార్హత విషయానికి వస్తే గిరిజన ప్రాంతాల్లో 10వ తరగతి లేదా ఇంటర్మీడియట్ చదువుకుంటే సరిపోతుంది. ఇక పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నియామకాలు పూర్తి అయితే చాలా మంది మహిళలకు పోస్టులు దగ్గర ఉన్నాయి. దీంతో వీళ్ళందరికీ జగన్ ప్రభుత్వంలో ఉపాధి లభించినట్లవుతుంది. అప్పుడు వీళ్లపై ఆధారపడిన కుటుంబాలు కూడా జగన్ పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటాయని చెప్పక తప్పదు. అప్పుడు జగన్కు లక్షలాది మంది చెల్లెమ్మల దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు ప్రచారంలో ప్రతి సారి తన చెల్లెమ్మలు అని చెప్పుకోవడమే కానీ ఐదేళ్లలో వాళ్లకు చేసిందేమీ లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలతో పాటు... ఇవ్వని హామీలు కూడా నెరవేర్చి మహిళల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు.