ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ స‌ర్వ‌త్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెండు రోజుల పూర్తి బిజీ షెడ్యూల్‌తో జ‌గ‌న్ ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క స‌మావేశాల్లో పాల్గొన‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స‌మ‌క్షంలో రాష్ట్ర స‌మ‌స్య‌ల ప్ర‌స్తావ‌న‌, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, హోంమంత్రి అమిత్‌షాతో స‌మావేశం, పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌డం...వంటి కీల‌క షెడ్యూల్ల‌తో జ‌గ‌న్ ఢిల్లీ టూర్ సాగ‌నుంది.

అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ముగిసి స‌భ వాయిదా ప‌డిన అనంత‌రం వైఎస్ జ‌గ‌న్‌ హస్తినకు బ‌య‌ల్దేరి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జ‌గ‌న్ సాయంత్రం భేటీకానున్నారు. శ‌నివారం ఢిల్లీలో జరిగే నీతి అయోగ్ సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హజరవుతారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చిస్తారు. ఏపీ సమస్యలపై ఎలా వ్యవహారించాలో వైసీపీ ఎంపీలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి 22 మంది ఎంపీలుగా గెలుపొందడంతో.. దేశంలో నాల్గో పెద్ద పార్టీగా వైసీపీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. పార్ల‌మెంటు తొలి స‌మావేశాల నేప‌థ్యంలో ఎంపీలకు జ‌గ‌న్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 22 మంది ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పార్లమెంట్‌లో పార్టీ వైఖరి ఎలా ఉండాలన్నదానిపై ఎంపీలకు కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం జగన్. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, కేంద్ర నిధులు, ఇతర అంశాలపై పార్లమెంట్ సభల్లో డిమాండ్ చేసేందుకు వైసీపీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం వైఎస్ జగన్ చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: