ఏపీ తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే విపక్ష టిడిపికి అదిరిపోయే షాక్లు తగిన సూచనలు కనిపిస్తున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో అసెంబ్లీలో టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితమైంది. ఇప్పుడు వీరిలో కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేసేందుకు ఆ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం ఓపెన్ చేసేశారు. కోటంరెడ్డి వ్యాఖ్యలు టిడిపి వర్గాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం శుక్రవారం కూడా అసెంబ్లీ లాబీల్లో బాగా సర్క్యు
లేట్ అయింది.
కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు నేరుగా తనతోనే టచ్లో ఉన్నారని... వారిద్దరు వైసీపీలో ఇప్పటికిప్పుడు చేరేందుకు రెడీగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు నియోజకవర్గంలో సొంత ఇమేజ్ ఉండి.. బలమైన వ్యక్తిగా ఉన్నారని... ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. ఇక మరో ఎమ్మెల్యే కూడా తనతో టచ్లో ఉన్నారని.. వారిద్దరు వైసీపీలో చేరేందుకు, జగన్ నాయకత్వంపై నమ్మకంతో ఉన్నారని కోటంరెడ్డి చెప్పారు.
ఈ ఇద్దరు పార్టీలో చేరతానన్న విషయాన్ని తాను సీఎం జగన్ గారి దృష్టికి తీసుకువెళ్లానని... ఆయన మన పార్టీలోకి ఎవరు వచ్చినా వారి గుణగణాలు, వ్యక్తిత్వాన్ని పరిశీలించి చేర్చుకుందామని కూడా అన్నట్టు కోటంరెడ్డి చెప్పారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు చెప్పేందుకు ఇష్టపడని ఆయన కనీసం.. వారు ఏ ప్రాంతానికి చెందిన వారో కూడా చెప్పేందుకు ఇష్టపడలేదు. ఇక పార్టీ మారేందుకు సుముఖంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ సభ్యత్వంతో పాటు ఆ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవాలని జగన్ చెప్పారని.. ఫిరాయింపు రాజకీయాలు చేస్తూ... ఫిరాయింపుల చట్టానికి తాను తూట్లు పొడవలేనని చెప్పారని కూడా కోటంరెడ్డి తెలిపారు.
ఇక పార్టీ మారేందుకు రెడీ అయిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చే ఐదేళ్ల పాటు తమ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో సాయం చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తే చాలన్న కండీషన్ మాత్రమే పెట్టారని.. దీనికి జగన్ కూడా ఒప్పుకున్నారని... అయితే వాళ్లు పార్టీతో పాటు, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని ఆయన చెప్పారన్నారు. ఇక మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నట్టు తనకు తెలిసిందన్నారు. ఏదేమైనా కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరా ? అన్న చర్చ ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది.