రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసిపి నేతలు దాడులు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. తాజాగా సమావేశమైన తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ దాడుల అంశంపై తీవ్రంగానే చర్చించారు. వైసీపీ దాడులను అడ్డుకునేందుకు నేతలంతా సంఘటితంగా పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
అధికారములోకి వచ్చిన 15 రోజుల్లోనే ఐదు హత్యలు, లెక్కకు మించిన దాడులు జరిగాయని చంద్రబాబు విమర్శించారు. ఈ దాడులను అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ పోలీసు కేసులు పెట్టించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. నిజమే.. రాజకీయ దాడులను ఏ పార్టీ చేసినా ఖండించాల్సిందే.
అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలను తెగ నరకటం, ఇష్టారీతిన దాడులు చేయడం ఎంత మాత్రమూ మంచిది కాదు. కానీ ఇదే తెలుగుదేశం నేతలు గత ఐదేళ్లలో చేసిందేమిటో వారికి వారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత ఐదేళ్లలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు పదుల సంఖ్యలో పొట్టనపెట్టుకున్నారు.
వైసీపీ కార్యకర్త అయితే చాలు అన్నట్టుగా దాడులకు తెగబడ్డారు. ఇప్పుడు అవన్నీ మరిచి దాడులు మంచిది కాదంటూ చంద్రబాబు చెబుతున్న సూక్తులు నవ్వు తెప్పిస్తున్నాయి. ఏదేమైనా ప్రత్యర్థి పార్టీలపై కక్షసాధింపు చర్యలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి.