భారతీయ జనతాపార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఏపీపై స్పెషల్ ఫోకస్ పెట్టారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ తరుపున కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు మాత్రమే గెలిచారు. అయితే టీడీపీ తరఫున గెలిచిన, ఓడిన కొందరు కీలకనేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ బీజేపీ కండువా కప్పుకుంటారని పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై సీఎం రమేష్ క్లారిటీ ఇస్తూ...తాను పార్టీ మారడం లేదన్నారు.
విజయవాడలో టీడీపీ రాష్ట్ర స్ధాయి సమావేశానికి హాజరైన సీఎం రమేష్ అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారడంలేదని ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని.. తాము కూడా ఎవర్నీ సంప్రదించలేదన్నారు. పార్టీ మారే అవసరం ఎవరికీ లేదని చెప్పారు. తమ పార్టీ వ్యూహకర్తగా నియమించేందుకు ప్రశాంత్ కిశోర్ను సంప్రదించామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎం రమేశ్ స్పష్టంచేశారు.
కాగా, పార్టీ ఎంపీలు, ప్రధానంగా రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం అనే వార్తలపై పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో...సీఎం రమేష్ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే, తాను పార్టీ మారడం లేదని రమేష్ చెప్పినట్లుగా టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇదే విషయాన్ని మీడియాలో చెప్ఆపలని ఆదేశాలు ఇవ్వడంతో...ఆయన మీడియాకు క్లారిటీ ఇచ్చినట్లు చెప్తున్నారు.