ఏపీలో జరిగిన తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఈ రికార్డుల్లో టీడీపీ కంచుకోటలుగా ఉన్న కొన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించడం, 21 మంది ఎమ్మెల్యేలకు ఏకంగా 40 వేల పైచిలుకు మెజార్టీ రావడం... టీడీపీ చరిత్రలోనే లేని విధంగా కేవలం 23 సీట్లతో సరిపెట్టుకోవడం.. ఇక ఆ పార్టీకి మూడు ఎంపీ సీట్లే రావడం... తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన వారు భారీగా ఉండడం... జగన్ ప్లాన్తో ఎలాంటి రాజకీయ అనుభవం లేని వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడం... ఇక చంద్రబాబు తనయుడు లోకేష్ ఓడిపోవడం.. ఏపీలో చాలా మంది మంత్రులు చిత్తుగా ఓడిపోవడం.. చివరకు చంద్రబాబు మెజార్టీయే 30 వేలకు పడిపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ ఘనమైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంటే... టీడీపీ చెత్త రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఇదిలా ఉంటే తెలుగు రాజకీయాల్లో తనది ఏకంగా 40 సంవత్సరాల ఘనమైనచరిత్ర అని పదేపదే చెప్పుకుంటూ గొప్పలు పోయే చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఓటమితో ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. సమైక్య రాష్ట్రంతో కలుపుకుంటే మొత్తం 14 సంవత్సరాలపాటు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు... రాజకీయంగా కనీసం మంత్రి పదవి కూడా చేపట్టని వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.
చంద్రబాబు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించారు... ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడైన చంద్రబాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఘనత తండ్రీకొడుకులు అయిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కింది. అలాగే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్.రాజశేఖర్రెడ్డి 1999-2004 మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఏపీ తొలి అసెంబ్లీలోనూ చంద్రబాబు సీఎంగా ఉంటే జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు.
1995 నుంచి 2004 వరకు చంద్రబాబు చేసిన అరాచక పాలనకు జనం విసిగిపోయి ఉన్నారు. సరికొత్త పాలన కోసం వారు వెయిట్ చేశారు. ఆ టైంలో 2003లో వైఎస్ సుదీర్ఘ పాదయాత్ర ద్వారా చంద్రబాబును అధికారం నుంచి దించేశారు. ఇక నవ్యాంధ్రలో తొలి సీఎంగా అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు ఉంటేనే బెటర్ అని ఆయన్ను సీఎం చేశారు. ఐదేళ్ల పాటు ఏపీలో ఘోరమైన దోపిడీ పాలన కొనసాగింది. చివరకు చంద్రబాబు అంటేనే విసిగిపోయి ఉన్న ప్రజలు జగన్మోహన్రెడ్డికి పట్టం కట్టారు. నాడు వైఎస్ ఏ పాదయాత్రతో చంద్రబాబను సీఎం కుర్చీ నుంచి దించేశారో నేడు జగన్ కూడా సుదీర్ఘపాదయాత్ర ద్వారా చంద్రబాబును అధికారం నుంచి దించేశారు. ఈ క్రమంలోనే తండ్రి కొడుకులు పాదయాత్రతో బాబును ప్రతిపక్షంలో కూర్చోపెట్టి సీఎం అయిన ఘనత సొంతం చేసుకున్నారు.