జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి నిర్ణయాల్లో ఒకటి గ్రామ వాలంటీర్ల నియామకం. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వాలంటీర్లను నియమిస్తున్నట్టు ప్రకటించారు. దాదాపు 4 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఈ ప్రకటన చేశారు.
పధకం అమలు విషయంలో పారదర్శకంగా ఉంటుందని, ప్రతి ఒక్కరు ఈ పోస్ట్ కోసం అప్లయ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నది. గ్రామ వాలంటైర్ పోస్ట్ కోసం ఎవరైనా అప్లయ్ చేసుకోవచ్చు. ఉద్యోగం వచ్చేది మాత్రం వైకాపా కార్యకర్తలకే అనే అనుమానాలు కలుగుతున్నాయి.
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఈ మాత్రం చేసుకోకపోతే ఎలా.. అందుకే ఇలా చేస్తున్నారని కొందరు అంటున్నారు. వైకాపా కార్యకర్తల కోసమే ఈ ఉద్యోగాల కల్పనను ఏర్పాటు చేసేటట్టయితే.. డైరెక్ట్ గా పార్టీ కార్యకర్తలకే పోస్టింగ్ లు ఇచ్చుకోవచ్చుకదా.. దానికి ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్ ఎందుకు.. అని కొందరి వాదన.
ప్రభుత్వ నోటిఫికేషన్ ఇవ్వకుంటే అది పార్టీ పోస్టింగ్ అవుతుంది. అదే ప్రభుత్వం నుంచి పోస్టింగ్ అయితే ఉద్యోగం అవుతుంది. ఉద్యోగాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి జగన్ ఈ ప్లాన్ వేశారు. ఏ పార్టీ అయినా, మొదట చూసుకునేది తన కార్యకర్తలనే. ఆ తరువాతే ఎవరైనా అనే నానుడిని నిజం చేస్తారో లేదంటే పారదర్శకంగా వ్యవహరిస్తారో చూడాలి.