ఇటీవల ఆయన కశ్మీర్లోని గుల్మార్గ్లో విహరిస్తుండగా ఓ మహిళా అభిమాని తన కూతురితో కలిసి ప్రకాశ్ రాజ్తో సెల్ఫీ దిగాలని కోరింది.
అభిమాని కోరడంతో ప్రకాశ్ రాజ్ అంగీకరించారు. సెల్ఫీలు దిగిన తర్వాత ఆమె భర్త ఒక్కసారిగా ప్రవేశించి,
'' ప్రకాశ్ రాజ్ చాలాసార్లు ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారని, ఆయనతో సెల్ఫీలు దిగుతావా..?'' అంటూ తన భార్యపై అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెల్ఫీలు ఫోన్లోంచి డిలీట్ చేయమని డిమాండ్ చేశాడు.
'' నేను మోదీతో విభేదిస్తాను కాబట్టి నాతో దిగిన సెల్ఫీలు డిలీట్ చేయాలని తన భార్యకు చెప్పాడు. ఆ మహిళ ఒక్కసారిగా కన్నీళ్లపర్యంతమైంది. దీంతో నేను అతన్ని పక్కకు తీసుకెళ్లి ... మీ భార్య మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి, అద్భుతమైన కూతుర్ని మీకు ఇవ్వడానికి, మీతో జీవితాన్ని పంచుకోవడానికి నేనో, మోదీనో కారణం కాదు. దయచేసి వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించండి.
సెలవులను ఆస్వాదించండి' అని చెప్పాను.
అతను జవాబు ఇవ్వకుండా అలాగే నిల్చుండిపోయాడు. నేను భారమైన మనసుతో అక్కడి నుంచి కదిలాను. '' అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు.