ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? అధికారంలోకి వచ్చిన జగన్ ఫస్ట్ టార్గెట్ గా కోడెల నే ఎంచుకొన్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే వినిపిస్తోంది.
అందుకే కోడెల శివప్రసాదరావు, ఆయన కుటుంబ సభ్యులపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావడం విశేషం. తాజాగా కోడెల శివ ప్రసాద్ రావు పై మరో కేసు నమోదయింది.
రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని 15 లక్షల రూపాయలు తీసుకొని తనను మోసం చేశారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు అనే క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను నేరుగా లంచం సొమ్ము అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు శివరాం కు ఇచ్చానని నాగరాజు చెబుతున్నాడు. ఈ మేరకు నరసరావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు ఆంధ్ర రంజీ జట్టులో ఆటగాడు. స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని తండ్రి కొడుకులు తనను మోసం చేశారని అంటున్నాడు. ఉద్యోగం ఇప్పించ లేనందువల్ల తన సొమ్ము తనకు వెనక్కి ఇవ్వాలని కోరినా ఫలితం దక్కలేదని నాగరాజు ఆరోపిస్తున్నాడు. అధికారం కోల్పోయిన తర్వాత.. ఎమ్మెల్యే గానూ ఓడిపోయిన కోడెల శివప్రసాదరావు ను వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. త్వరలోనే ఆయన, ఆయన కుటుంబ సభ్యులు జైలు ఊచలు లెక్కపెట్టినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నది విశ్లేషకుల మాట.