వైయస్ రాజశేఖర్ రెడ్డి.. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రుల్లో తన ప్రత్యేకత చాటుకున్న విశిష్ట నాయకుడు. పరిపాలించినది ఆరేళ్ళే అయినా అనంతమైన ఖ్యాతిని తన వెంటబెట్టుకుని వెళ్లి పోయారు. ప్రత్యేకించి సంక్షేమ పథకాల అమలులో తనదైన ముద్ర వేశాడు.
మొన్నటి ఎన్నికల్లో జగన్ ఆ స్థాయిలో విజయం సాధించాడు అంటే అందుకు వైయస్ వేసిన పునాది కారణం. అయితే ఆయన పాలనలో కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిలో మొదటిది విచ్చలవిడిగా రేషన్ కార్డులు మంజూరు చేయడం. రాష్ట్ర జనాభా ను మించి రేషన్ కార్డులు ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకత.
వైయస్ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులను తదుపరి ప్రభుత్వాలు కూడా కొనసాగించాయి. ఇప్పుడు జగన్ సర్కార్ కు అవే గుదిబండగా మారనున్నాయి. జగన్ సర్కారు నవరత్నాల పథకాలను అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉంది.
ఈ పథకాలు అన్నింటికీ ప్రాతిపదిక తెల్ల రేషన్ కార్డు మాత్రమే. కానీ లెక్కకు మిక్కిలి గా ఉన్న ఈ తెల్ల రేషన్ కార్డులను సంస్కరించకపోతే నవరత్నాలు అమలు చేయడం సర్కారుకు తలకు మించిన భారమే అవుతుంది. అనర్హులకు రాష్ట్ర ఖజానాను దోచి పెట్టడమే అవుతుంది. మరి జగన్ అయినా తెల్లరేషన్ కార్డులను సంస్కరిస్తాడా.. లేక అలాగే గుడ్డిగా ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని మరింత అప్పులపాలు చేస్తారా.. చూడాలి ఏం జరుగుతుందో..