ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా తన సత్తాచాటుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా, పార్టీ అధినేతగా...తానేంటో అనతి కాలంలోనే నిరూపించుకొని చరిత్ర సృష్టించే మెజార్టీతో సీఎం పీఠం కైవసం చేసుకున్న జగన్...ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తన వ్యూహచతురతతో అనతికాలంలోనే ఔరా అనిపించుకునేలా ఎదుగుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఒకనాడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన ప్రచార రాజకీయాలు..ఫోటో షూట్లకు భిన్నంగా...జగన్ ఢిల్లీ వేదికగా తానెంటో చర్యల ద్వారా నిరూపిస్తున్నారు. ఇందుకు తాజాగా జగన్ ఢిల్లీ టూర్ నిదర్శనమని పలువురు చర్చించుకుంటున్నారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని వేదికలను ఉపయోగించుకుంటున్న జగన్ పొరుగు రాష్ట్రాలతో సంబంధాల విషయంలో ముందెన్నడూ లేని పరిణతిని ప్రదర్శిస్తున్నారు. ప్రధాని అధ్యక్షతన జరుగుతున్న నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా కర్నాకట సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో విందును ఏర్పాటు చేసిన జగన్.. ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామిని ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించిన కుమారస్వామి జగన్ ఇంటిలో జరుగుతున్న విందు భేటీకి హాజరు అయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులతో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. కాగా, ఈ భేటీలో ఏపీ, కర్ణాటకకు లబ్ధి చేకూర్చే అంశాలపై ఇరువురు నేతలు కీలక అంశాలు చర్చించారు. తద్వారా కుమారస్వామి చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేయగా..ఆయన్నే తన నివాసానికి ఆహ్వానించి భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్.
మరోవైపు నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ నివేదికను సమర్పించారు. రెవెన్యూ లోటు, ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరించిన జగన్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని నీతి ఆయోగ్ ముందుంచారు. విభజనలో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగిందని, 59శాతం జనాభా ఉన్న రాష్ట్రానికి 47 శాతం మాత్రమే ఆదాయాన్ని పంచారన్నారు. అధిక ఆదాయాన్నిచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్లడంతో ఏపీ తీవ్రంగా నష్టపోయిందని, ఐటీ రంగం హైదరాబాద్లో కేంద్రీకృతం కావడంతో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందన్నారు. చిన్న వయసులోనే రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై జగన్ ప్రసంగం పరిణతితో కూడిన ప్రసంగం సాగిందని ఈ సందర్భంగా పలువురు చర్చించుకోవడం గమనార్హం.