జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టినుంచి పాలనా వ్యవహారాలను పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టే క్రమంలో దూకుడుగా దూసుకుపోతున్నారు. గత రెండు వారాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్‌డీఏ గవర్నమెంట్ రాష్ట్రానికి సంబంధించిన రూ.4,200 కోట్ల బిల్లులను క్లియర్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న విధానాలు ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. 


కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.3,000 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాధ్ దాస్ తాజా ప్రతిపాదనల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పోలవరం జాతీయ ప్రాజెక్టు కావడంతో దీని నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటిదాకా రూ.11,655 కోట్లు ఖర్చుపెట్టింది.


ఇందులో కేంద్రం రూ.6,726 కోట్లు ఇచ్చింది. మిగతా డబ్బుల కోసం చంద్ర బాబు ప్రభుత్వం చాలా సార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే మోదీ సర్కార్ నుంచి స్పందన కరువైంది. అయితే ఇప్పుడు జగన్ రాకతో పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రూ.3,000 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఫైల్ తొలిగా ఆర్థిక శాఖ వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి నాబార్డ్‌కు చేరుతుంది. ఈ బ్యాంక్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది. యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ అందించిన తర్వాత మిగతా రూ.1,929 కోట్లకు కూడా త్వరలో ఆమోదం లభించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: