ఈరోజు నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో ఎంపీల ప్రమాణస్వీకారం ఉంటుంది. ఆ వెంటనే ఉపరాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. దాదాపు 40 రోజులపాటు ఈ సమావేశాలు జరగబోతున్నాయి.
ఈ సమావేశాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్పీకర్ ఎన్నిక తరువాత సభా మర్యాద ప్రకారం లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో స్పీకర్ ను తోడ్కొని వెళ్లి ఆయన సీట్లో కూర్చోపెట్టాలి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు లోక్ సభ ప్రతిపక్ష నేత ఎవరు అన్నది అనౌన్స్ చేయలేదు.
దీంతో ఎవరు ప్రతినిత్యం వహిస్తారో తెలియడంలేదు. గాంధీ కటుంబానికి విధేయుడిగా ఉండడంతో పాటు, హిందీ, ఆంగ్ల భాషలపై పట్టున్న నాయకుడు ఎవరన్న దానిపై పార్టీలో అంతర్మథనం జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శశిథరూర్, మనీశ్ తివారీ, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి, కేరళకు చెందిన కే.సురేశ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అయితే, శశిథరూర్ విషయంలో సునంద కేసు ఉన్నది కాబట్టి ఆయనకు బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదు. మనీశ్ తివారీకే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు ఆయన సమర్థంగా నిర్వహించారు.
అలాగే రెండు భాషలపై తివారీకి మంచి అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం. సమావేశాలు ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్న నేపథ్యంలో సభలో పార్టీ నేతతో పాటు, డిప్యూటీ లీడర్, చీఫ్ విప్, విప్ నియామకాలు చేపట్టాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.