హైదరాబాద్‌: కోల్‌కతాలో జూనియర్‌ వైద్యులపై జరిగిన దాడికి నిరసనగా ఐఎంఏ (ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. గత మూడురోజులుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో ధర్నాలు, నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరికి సంఘీభావంగా రాష్ట్రంలోని మరిన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది నిరసనలు చేపట్టనున్నారు.

 

అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వైద్య సేవల్ని ఆపేస్తామని ఐఎంఏ పేర్కొంది. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది. కోల్‌కతాలో ఘటనకు కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చట్టపరంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలని విన్నవించింది.

 

దేశవ్యాప్తంగా వైద్యులకు రక్షణ కల్పించాలని.. వీరిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని భారత శస్త్రచికిత్స నిపుణుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ రఘురాం కోరారు. కోల్‌కతాలోని ఎన్‌ఆర్‌ఎస్‌ వైద్య కళాశాలలో వైద్యులపై దాడి జరిగిన నేపథ్యంలో ఆదివారం ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. వైద్యుల్లో భరోసా కల్పించడానికి తక్షణమే చేపట్టాల్సిన చర్యలను రఘురాం లేఖలో వివరించారు.

 

కోల్‌కతాలో విధ్వంసకర దాడికి పాల్పడిన నిందితులను గుర్తించి వారిని వెంటనే అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: