బీజేపీ వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారాలని భావిస్తున్నట్టు క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అయితే జగన్ డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా బీజేపీ నాయకులూ స్పందిస్తూ, అదొక ముగిసిన అధ్యయనంగా పేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు ఇదే మాటను విజయవాడ గడ్డపై చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లోని తన నియోజకవర్గంలో నిర్వహించిన పాదయాత్ర సందర్బంగా కేంద్ర హోం శాఖ సహా మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు రాజకీయాలకు పాల్పడటం కాకుండా సరైన రీతిలో అవగాహన కల్పించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన హామీల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్, జగన్..విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
ఇక, బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు విజయవాడలో మీడియాతో చిట్ చాట్లో భాగంగా ప్రత్యేక హోదా ఇక ముగిసిన అధ్యాయమే అని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో.. వారికేం ఇవ్వాలో మాకు తెలుసని అన్నారు. బీజేపీకి 250 సీట్ల కంటే ఎక్కువ రాకూడదని కోరుకున్న జగన్ మాకు మిత్రుడెలా అవుతారని మురళీధర్ రావు ప్రశ్నించారు. ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని భర్తీ చేయడమే ప్రస్తుతం మా ముందున్న లక్ష్యమని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తేనే.. ఇతరులు తమ వద్దకు వస్తారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీ బలమైన శక్తిగా అవతరించబోతోందని ఆయన జోస్యం చెప్పారు.