ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. గవర్నర్ ప్రసంగంలో రాజధాని ప్రస్తావన లేదని టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ ఈరోజు ఇక్కడకు వచ్చి పరిపాలన చేస్తున్నారంటే అందుకు కారణం రాజధాని అని అన్నారు.
చంద్రబాబు ముందుచూపుతో అమరావతిలో యుద్ధ ప్రాతిపదికన అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు నిర్మించారని అచ్చన్న అన్నారు. చంద్రబాబు హుటాహుటిన రాజధానిని అమరావతికి తరలించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఇక్కడే అచ్చన్న కు అదిరిపోయే కౌంటర్ పడింది.
రాజధానికి ఎంత త్వరగా వచ్చామంటే కారణం చంద్రబాబేనని అచ్చన్న అంటే.. కాదు కాదు.. ఓటుకు నోటు కేసు.. అంటూ వైసిపి ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. వైసీపీ నేతల నినాదాలతో అచ్చన్న గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అనవసరంగా రాజధాని ప్రస్తావన తెచ్చి అచ్చన్న ఇరుకున పడ్డారు.
2014 ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత కొన్నాళ్లకే రాజధాని అమరావతికి పరిపాలన తీసుకొచ్చారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను వాడుకునే అవకాశం ఉన్నా.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హడావిడిగా అమరావతి వచ్చేశారు. ఈ విషయం ప్రపంచమంతా తెలిసిందే.