తెలుగుదేశం పార్టీ నేతలు...తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన చర్యల కారణంగా నవ్వుల పాలు కావాల్సి వస్తోంది. తాజాగా గవర్నర్ ప్రసంగంపై హాట్ హాట్ చర్చ ఏపీ అసెంబ్లీలో జరిగింది. తొలిరోజైన సోమవారం సభలో చర్చ వాడీవేడీగా జరిగింది. గవర్నర్ ప్రసంగంలో భాగంగా, మానవ, భౌతిక వనరుల దుర్వినియోగం రాష్ట్రం దుస్థితిని మరింత తీవ్రతరం చేసిందని గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై.. టీడీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ ఊహించని కౌంటర్ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా వారిద్దరి మధ్య ఘాటు సంభాషణ జరిగింది.ఏమీ తెలియని అనిల్ చంద్రబాబు నాయుడుకు ఇరిగేషన్ పాఠాలు చెపుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. దానికి బదులుగా అనిల్ కుమార్.. తనకు తెలియకుంటే తెలుసుకుంటానని, మంగళగిరిని మందలగిరి అని కూడా పలకడం రాని పప్పును కాదని అన్నారు. ఎన్నికల్లో గెలవని వ్యక్తిని మంత్రిని చేశారంటూ అనిల్ కుమార్ ధ్వజమెత్తారు.
ఏపీలో అవినీతి భారీ స్థాయిలో జరిగిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. నీరు-చెట్టు ప్రాజెక్టులో, ధర్మపోరాట దీక్ష పేరుతో, పోలవరం నిర్మాణంలో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయన్నారు. అందుకే ఆ పార్టీ నుంచి కేవలం 23 మందే గెలిచారని అన్నారు. వీరందరినీ ‘ఆలీ బాబు.. 23 దొంగలు’ అని సంబోధించారు. కాగా లోకేష్ పేరుతో తమను ప్రస్తావించిన తీరుపై....పలువురు టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.