జగన్ మంత్రివర్గంలో ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైకాపాకు చక్కటి అస్త్రంగా అంది వస్తున్నారు. సహజంగానే విషయ పరిజ్ఞానం ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వైకాపా వాదనను బలంగా వినిపించగలుగుతున్నారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రాజేంద్రనాథ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఎంతటి క్లిష్ట విషయాలనైనా ఇట్టే అర్ధం చేసుకోగలగడం బుగ్గన ప్రత్యేకత. ప్రత్యేకించి ఆర్థిక విషయాలలో, టెండర్లు ప్రాజెక్టులు వంటి గణాంకాల విషయంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చక్కటి విషయ పరిజ్ఞానం కలిగి ఉన్నారు. ఆయన ప్రజా పద్దుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు టెండర్ల లొసుగులు వంటి విషయాలను ఆయన బయట పెట్టారు.
ఇప్పుడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్షం విమర్శలను బుగ్గన సమర్థంగా తిప్పి కొడుతున్నారు. ఏ మాత్రం ఆవేశానికి లోను కాకుండా శాంతంగానే విపక్ష నేతలకు చురకలు అంటిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే పని యనమల రామకృష్ణుడు చేసేవారు.
కాకపోతే యనమల రామకృష్ణుడు గణాంకాల వివరణ కంటే ప్రతిపక్షంపై అడ్డగోలు విమర్శలు చేయడం పైనే ఎక్కువగా దృష్టి సారించేవారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం అలా కాకుండా శాంతంగా గణాంకాలతో ప్రతిపక్షం విమర్శలు తిప్పి కొడుతున్నారు. మొత్తంమీద బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి జెంటిల్ మెన్ మినిస్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.