ఆంధ్రప్రదేశ్ శాసనసభ తొలి అసెంబ్లీ సమావేశాలు మహా రంజుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార సమావేశాలు కావడంతో సహజంగానే అధికార విపక్ష పార్టీల మధ్య పెద్ద వివాదాలు ఉండవు అని... ఈ సమావేశాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మాత్రమే ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే విపక్ష టిడిపి అనూహ్యంగా రెండో రోజు నుంచే అధికార వైసీపీపై ఎటాక్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే సభలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో వారు కూడా టిడిపిపై డబుల్ రేంజ్లో ఎటాక్ చేస్తున్నారు.
మొత్తానికి అందరూ ఊహించిన దానికి భిన్నంగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరంభంలోనే మంచి రక్తి కట్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ నేతలు పరస్పరం పలకరించుకున్నారు. అసెంబ్లీ లాబీలో వైసిపి కార్యకర్తలు రోజాతో సెల్ఫీ దిగడంతో అక్కడ రద్దీ ఏర్పడింది. వెంటనే అటుగా వచ్చిన బాలయ్య అక్కడ కొద్దిసేపు నిలబడ్డారు. అక్కడ ఉన్న మార్షల్స్ అక్కడ ఉన్న వారిని పక్కకు నెట్టి బాలయ్యకు దారి ఇచ్చారు. వెంటనే బాలయ్యను చూసిన రోజా నవ్వుతూ బాగున్నారా ? అని పలకరించడంతో బాలయ్య కూడా వెంటనే ఫైన్ అని ఆన్సర్ ఇచ్చారు.
ఇక టీడీపీకి చెందిన సీనియర్ నేత కరణం బలరాం కూడా అటుగా వచ్చారు. బలరాంను చూసిన రోజా అన్న మీరు మా వైపు ఎమ్మెల్యేగా వస్తారని అనుకున్నాం... కానీ టీడీపీ నుంచి వచ్చారు అనడంతో ఆయన నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా కొద్దిసేపు అసెంబ్లీ లాబీల్లో సందడి సందడి చేశారు. ఆరు నెలల వరకు మాట్లాడనని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇక సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని, టీడీపీ ఎమ్మెల్యే పైయ్యావుల కేశవ్ కూడా కాసేపు ముచ్చటించుకున్నారు.