టీడీపీపై కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందంటూ ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై వైసీపీ రౌడీలు దాడులు చేస్తున్నారని, దౌర్జన్యాలతో తమ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించవద్దంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ లోకేశ్ చేసిన ట్వీట్‌పై ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఆరోపణలను ఖండించిన ఆమె, ఘాటుగా బదులిచ్చారు.

 

సచివాలయంలో సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా అధికారిపై చేయి చేసుకున్నారు, కాల్‌ మనీ వ్యవహారంపై మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న చరిత్ర కలిగిన టీడీపీ నేతలు ఇప్పుడు తమ కార్యకర్తలపై దాడులు పెరిగాయనడం విడ్డూరంగా ఉందని ఆమె చమత్కరించారు.

 

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 57 మంది వైసీపీ కార్యర్తలు గాయపడితే, 44 మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. ఈ గణాంకాలు చూస్తే ఎవరిపై ఎవరు ఎక్కువగా దాడులు చేస్తున్నారో స్పష్టమవుతుందని హోం మంత్రి అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి, ఇదేనా రాజన్న రాజ్యం అన్న నారా లోకేశ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఆమె ఖండించారు.

 

2014 జులైలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు మా వాళ్లు ఏం చేసినా చూసీచూడనట్లుగా వదిలేయాలని సూచించారని ఆమె విమర్శించారు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని మంత్రి  పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: