ప్రత్యేకహోదా అంశంపై
ఈరోజు అసెంబ్లీ జరిగిన చర్చలో చంద్రబాబునాయుడు పరువును మంత్రి అవంతి శ్రీనివాస్
సాంతం తీసేశారు. హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని జగన్మోహన్
రెడ్డి తీర్మానం కాపీని చదివి వినిపించారు. దానిపై చంద్రబాబును మాట్లాడమని
అన్నపుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని మాట్లాడారు.
తాము అధికారంలో ఉన్నపుడు హోదాను చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే అచ్చెన్న మాట్లాడుతూ హోదా కోసం జనాలు, రాజకీయ పార్టీలతో తాము కూడా కలిసి పోరాటం చేసినట్లు బిల్డప్ ఇచ్చారు. దానిపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఎదురుదాడి చేశారు. అవంతి మాట్లాడుతూ చంద్రబాబు పరువు తీసిపడేశారు.
మొన్నటి ఎన్నికల వరకూ అవంతి టిడిపి నుండి అనకాపల్లి ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని అవంతి ప్రస్తావిస్తూ హోదా కోసం తాను ఆమరణ నిరాహార దీక్ష చేసినపుడు తనపై చంద్రబాబు మండిపడ్డారంటూ చెప్పారు. హోదా డిమాండ్ పై తాను రాజీనామా చేయటానికి అప్పట్లో సిద్ధపడితే చంద్రబాబే అడ్డుపడినట్లు మండిపడ్డారు.
హోదా కోసం అప్పట్లో ఆందోళనలు చేసిన వారిపై చంద్రబాబు అప్పట్లో కేసులు పెట్టించిన విషయాన్ని గుర్తు చేశారు. అసలు హోదా అంశాన్ని ఇంతగా కంపు చేసిన వ్యక్తే చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. మొత్తానికి హోదా డిమాండ్ విషయంలో పిల్లిమొగ్గలు వేసిన చంద్రబాబును ప్రతిపక్షంలోకి వచ్చినపుడు అదే అంశం మెడకు చుట్టుకోవటం విచిత్రంగా ఉంది.