జగన్ సీఎం అయిన తరువాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు తొలి రోజు నుండి వాడి వేడిగా జరుగుతున్నాయి. తొలి రోజు నుంచి మాటల తూటాలు.. పవర్ ఫుల్ పంచ్లు పేలుతున్నాయి. గవర్నర్ ధన్యవాద తీర్మానంలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన రోజా.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై పవర్ ఫుల్ పంచ్లు పేల్చుతూనే.. అధినాయకుడు జగన్పై ప్రశంసల జల్లు కురింపించడంతో భాగంగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ను వాడేశారు.
‘ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు.. కాని ప్రతి జనరేషన్లోనూ ఓ కొత్త థాట్ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడే టార్చ్ బేరర్ అంటారు.. వెళ్తున్నాడు చూశావా?
దాన్ని కొంచెం చేంజ్ చేస్తూ, రోజ.. ‘ప్రతి సంవత్సరానికి బతుకు ఆలోచన మారుతుందంటారు అధ్యక్షా.. దాన్ని సినిమా లాంగ్వేజ్లో ట్రెండ్ అంటారు... రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు. కాని ప్రతి జనరేషన్కి ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకువెళ్లేది ఒక్కరే ఉంటారు. ఆయన్నే టార్చ్ బేరర్ అంటారు’.. గవర్నర్ ప్రసంగం చూశాక.. ఈ నవ్యాంధ్రని నవశకం వైపు నడిపించే టార్చ్ బేరర్ దొరికాడు అతనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్’ అంటూ రోజా పవర్ ఫుల్ డైలాగ్ని చెప్పగా వైసీపీ ఎమ్మెల్యేలు చప్పట్ల మోత మోగించారు.
అయితే రోజా నేటి ఎమ్మెల్యే అయినా.. నాటి హీరోయిన్ కదా అందుకే సినిమా డైలాగ్లను బాగానే వాడేస్తున్నారు. త్రివిక్రమ్ డైలాగ్ రోజాకి ఇలా ఉపయోగపడిందా? అంటూ సోషల్ మీడియాలో జనసైనికులు ట్రోలింగ్ చేస్తున్నారు. తన ప్రసంగం వీడియోను ఫేస్ బుక్లో పోస్ట్ చేస్తూ.. ‘టార్చర్ చంద్రబాబు పాలనకు.. టార్చ్బేరర్ వైయస్ జగన్ పాలనకు చాలా తేడా ఉంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు రోజా.