నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వీఐపీ క్యూలైన్లో నిల్చుని కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు వెల్లంపల్లి శ్రీనివాస్ కి స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ఆర్డినెన్స్ ద్వారా తితిదే ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి త్వరలో నూతన బోర్డును నియమిస్తామన్నారు. శ్రీవారి ఆభరణాల భద్రతపై ఉన్న అపోహలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని, త్వరలోనే తితిదే అధికారులతో సమీక్షిస్తామని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వంశ పారపర్యంగా వస్తున్న అర్చకత్వానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి ప్రకటించారు. కాగా.. పురాతన నాణేలతో తయారు చేసిన మెమెంటో వివాదాలపై విచారణ జరపి, బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.