కాళేశ్వరం పూర్తి అయితే తన నియోజకవర్గంలోని సింగూరు, మంజీర ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయని జగ్గారెడ్డి తెలిపారు. తమ సంగారెడ్డికి ఉపయోగపడే అత్యంత పురాతన మహబూబ్ సాగర్కు కూడా నీళ్ళు వస్తాయన్నారు. వీటి ద్వారా తమ సంగారెడ్డి ప్రజల సాగు , త్రాగు నీటి సమస్య తీరుతుందని తెలిపారు. ``మంచి పని ఎవరు తలపెట్టిన సమర్థించాలి. ప్రాజెక్టులు, డ్యాంలు రైతులు, ప్రజల కోసం ఎవరు కట్టినా మంచిదే. తెలంగాణ తొలి డ్యాం నాగార్జున సాగర్ నెహ్రూ ప్రధానిగా కాంగ్రెస్ సీఎం లు పూర్తి చేశారు. శ్రీశైలం కూడా ఇందిరా ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ సీఎం లు ఉన్నప్పుడే పూర్తి చేశారు. మా సింగూరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిర్మించారు. నాడు కాంగ్రెస్ సీఎంలు కట్టినా నేడు సీఎం కేసీఆర్ కట్టినా అన్ని తెలంగాణ ప్రజలకోసమే అని భావించాలి. వాటిని రాజకీయం చేయొద్దు. ఒక రకంగా సోనియా , రాహుల్ తెలంగాణ ఏర్పాటు చేయటం వల్లే కేసీఆర్ సీఎం అయ్యి కాళేశ్వరం కడుతున్నాడు అందులో కాంగ్రెస్ భాగస్వామ్యం ఉంది.`` అంటూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రారంభం అయిన ఏడాదిలో సింగూరు, మంజీర, మహబూబ్సాగర్ ప్రాజెక్టులను నీళ్ళతో నింపితే మా సంగారెడ్డి రైతులు, ప్రజల పక్షాన కేసీఆర్కు ఘనంగా సన్మానం చేస్తామని సంచలన ప్రకటన చేశారు. ``కాళేశ్వరం అవినీతి గురించి నేను మాట్లాడను ...అది మా శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చూసుకుంటారు. కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చినా తప్పులేదు.`` అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, కాంగ్రెస్ నేతలంతా, ప్రాజెక్టును వ్యతిరేకిస్తుంటే...జగ్గారెడ్డి సమర్థించడం సంచలనంగా మారింది.