అవును! రాజకీయాల్లో వచ్చే మార్పులు ఆయా పార్టీల అధినేతలపై అనేకానేక బాధ్యతలను మోపుతాయనడంలో సందే హం లేదు. ఇప్పుడు రాష్ట్రంలోని 151 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించిన జగన్కు ఇప్పుడు ఇలాంటి బాధ్యతలే వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఆయన సొంత ప్రాంతం రాయలసీమ ప్రజలు గుండుగుత్తుగా జగన్తో అంటకాగారు. వెనుక-ముందు చూసుకోకుండా, సీనియర్-జూనియర్ అనే మాటే లేకుండా సీమలోని నాలుగు జిల్లాల ప్రజలు కూడా జగన్తో కలిసి ముందుకు నడిచారు.
ఈ నాలుగు జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వీటిలో 49 చోట్ల వైసీపీ జెండా రెపరెపలాడింది. కేవలం మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజయం సాధించింది. మరి ఈ నేపథ్యంలో రాయలసీమపై జగన్ బాధ్యత ఏంటి? గతంలో ఎన్నడూ.. లేనివిధంగా జగన్కు సీమ వాసులు మూకు మ్మడిగా మద్దతు పలకడం వెనుక విషయం ఏంటి? ప్రాంతీయ భావమా? లేక సమస్యలు తీరుస్తాడనే ప్రగాఢ విశ్వాసమా? ఏముంది? ఇప్పుడు ఇదే ప్రశ్న తెరమీదికి వచ్చింది. జగన్ పాలన ప్రారంభమై.. 15 రోజులు పూర్తయిన నేపథ్యంలో సీమ వాసుల దృష్టి ఇప్పుడు అమరావతిపైనే ఉంది.
మేం.. నమ్మాం.. మమ్మల్ని ఆదుకుంటాడా? కోడా? అని ఇక్కడి ప్రజలు వేల కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక, ఇక్కడ ప్రధాన సమస్య నీరు. సాగు, తాగునీటికి కూడా ఇబ్బందులే. ముఖ్యంగా సాగు నీరు లేక పోవడంతో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని గ్రామీణ ప్రజలు పూర్తిగా వలసబాట పట్టారు.
ఇక, ఇక్కడి రైతులు తమ పొలాలు బీళ్లుగా మారడంతో నివ్వెర పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వర్షాలు పడ లేదు. ఈ క్రమంలో వీరి ఆశలన్నీ జగన్పైనే ఉన్నాయి. ఇక, ఇక్కడ కనిపిస్తున్న మరో కీలక పరిణామం.,. తెలంగాణ సీఎంతో జగన్ సంధిచేసుకోవడాన్ని ఇక్కడి ప్రజలు స్వాగతిస్తున్నారు.
దీనికి కారణం.. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద అలుగు నిర్మాణం సాకారమవుతుందనే. అతి తక్కువ వ్యయంతో అలుగు నిర్మించితే 50 టీఎంసీల నీరు నిల్వ చేయవ చ్చునని తద్వారా ఎప్పుడైనా సరే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీరు అందజేసే అవకాశ ముందని ఈ ప్రాంత రైతులు కొన్నేళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనివల్ల తెలంగాణ లో కొంత ప్రాంతం ముం పునకు గురయ్యే అవకాశం ఉంది. నిన్న మొన్నటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిపై అడ్డు చెబుతూనే ఉంది. ఇక, ఇప్పుడు తెలంగాణ ప్రభు త్వం ఏపీ ప్రభుత్వంతో మైత్రిగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో తమ సమస్యలు తీరుతాయని ఇక్కడి ప్రజలు భావి స్తున్నారు.
వాస్తవం చెప్పాలంటే వచ్చే ఐదేళ్ళు రాయలసీమలో గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, సిద్దేశ్వరం వద్ద అలుగు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నీటి విడుదల 44 వేల క్యూ సెక్కులకు పెంచడం ప్రధానమైన డిమాండ్లుగా వున్నాయి. ఈ అన్ని డిమాండ్లకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే తప్ప రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైసిపి ప్రభుత్వం సీమ ప్రజలను సంతృప్తి పరచడం అసాధ్యం. సో.. మొత్తానికి జగన్ విజయం వెనుక చాలా భారం ఉందన్నమాట.