చూసే కోణాన్ని బట్టి ఏదైనా కనబడుతుంది. ఇది అక్షరాల నిజం. వైసీపీ నేతల విషయంలో ఈ సంగతి మరోసారి నిజమవుతోంది. జగన్ సహా పలువురు వైకాపా నేతల పై ఎల్లో మీడియా కారణంగా ఇప్పటివరకు నెగిటివ్ ఇమేజ్ ఉంది.
తెలుగు మీడియాలో ఎక్కువ శాతం తెలుగుదేశం అనుకూల మీడియా నే కావడం వల్ల వైసీపీ నేతల పై ఇన్నాళ్లు ఎంతో బురద జల్లారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు వై సీ పీ కే అనుకూలంగా వచ్చింది. అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి ఉన్నారు.
అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల పుణ్యమా అని ఇప్పుడు వైసిపి నేతల టాలెంట్ ప్రజలకు నేరుగా తెలుస్తోంది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి నాయకుల పదునైన ప్రసంగాలు వింటుంటే ఇన్నాళ్లు ఈ టాలెంట్ అంతా ఎందుకు మీడియాలో కనిపించలేదా అన్న ప్రశ్న ఉదయించకమానదు.
అసెంబ్లీలో మంచి వాదనాపటిమతో ప్రతిపక్షానికి సమాధానం చెబుతున్న ఈ నేతలంతా.. ముందు ముందు టిడిపికి చుక్కలు చూపించడం ఖాయం. అయితే మంద బలం ఉంది కదా అని కాకుండా విపక్షం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతూ పోతే ప్రజల్లో వీరి పరపతి పెరుగుతుంది. ఎవరైనా తమ శక్తిసామర్థ్యాలు నిరూపించుకోవాలంటే తగిన అవకాశం రావాలన్నది వీరిని చూస్తే అర్థం అవుతోంది.