ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మొదటి నుంచి ఇదే. ప్రత్యేక హోదా సాధించి తీరుతాం అంటూ జగన్ కొన్నేళ్లుగా చెబుతున్నారు. ఒకే విధానం ప్రకటించడంతో జగన్ పై జనం కూడా నమ్మకం ఉంచారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రధాన మంత్రిని కలిసిన తొలి భేటీలోనే ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా తోను హోదా గురించి చర్చించారు.
ఏపీ అసెంబ్లీ లో ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం గురించి తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఇలా హోదాపై జగన్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారవిడిచు కోవడం లేదు.
తాజాగా కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీలోనూ జగన్ ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ ఇచ్చిన హామీ కూడా అమలు కాక పోతే ఎలా అంటూ నిలదీశారు. జమిలి ఎన్నికలు ప్రధానాంశంగా జరిగిన ఈ సమావేశాన్ని జగన్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఇలా జగన్ ఎక్కడపడితే అక్కడ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని కుమ్మేస్తున్నారు.