ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చకచకా నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నారు. ఎలాంటి కీలక అంశం అయినా పెద్దగా జాప్యం చేయకుండా నిర్ణయం తీసుకుంటున్నారు. మొత్తానికి దూకుడు సీఎంగా పేరు తెచ్చుకుంటున్నారు.
ఇలా అంతా బాగానే ఉన్నా ఒక అంశంపై మాత్రం ఆయన ఇంకా క్లారిటీకి రావడం లేదు. అదే రాజధాని అమరావతి అంశం. రాజధాని నిర్మాణం పై ఇప్పటివరకు ఎలాంటి నెగెటివ్ సంకేతాలు ఇవ్వకున్నా.. పాజిటివ్ గా చెప్పింది లేదు. దీంతో అమరావతి నిర్మాణం ఆగిపోయింది అంటూ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి.
తాజాగా ఆగిపోయిన అమరావతి పేరుతో ఆంధ్రజ్యోతి పత్రిక పతాక శీర్షికతో ప్రత్యేక కథనం వెలువరించింది. అమరావతి సంబంధించిన 70 శాతం ప్రాజెక్టులను ప్రభుత్వం నిలిపేసిందని ఆ కథనం వివరించింది. అమరావతిలో ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి అని రాసుకొచ్చింది.
అమరావతి చుట్టుపక్కల ప్లాట్ల ధరలు కూడా వేగంగా పడిపోతున్నాయని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్ అమరావతి విషయంపై ఎటూ తేల్చకపోవడంతో రియల్ ఎస్టేట్ పరిస్థితిపై ప్రభావం చూపుతోందని సుదీర్ఘ కథనం వివరించింది. ఇలాంటి కథనాలు మరిన్ని వెలువడక ముందే జగన్ అమరావతి విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటే బావుంటుంది.