విజయసాయిరెడ్డి.... తెలుగు రాజకీయాల గురించి తెలిసిన వారికి పరిచయం అవసరం లేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కుడి భుజంలా ఉంటూ పార్టీ గళాన్ని సమర్థంగా వినిపించే నేత. తెలుగుదేశం పార్టీ నేతలకు జగన్ తర్వాత ఆ స్థాయిలో చెమటలు పట్టించే నాయకుడు. వైసీపీ ముఖ్యనేత అయిన విజయసాయిరెడ్డి సత్తా తాజాగా ఢిల్లీ వేదికగా రుజువు అయింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయసాయిరెడ్డిని ప్రత్యేకంగా గుర్తించి `విజయ గారు...`అని సంబోధించడం అక్కడి జాతీయ నేతల్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే అంశంపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ బుధవారం పలు రాజకీయ పక్షాల నేతలను కలుసుకున్నారు. జమిలి ఎన్నికలతోపాటు, ఈ ఏడాది జరుగనున్న మహాత్మాగాంధీ 150వ జయంతి, 2022లో జరుగనున్న భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాలపై ఆయన వారితో చర్చలు జరిపారు. పార్లమెంట్ ఉభయసభల్లో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల అధ్యక్షులను ప్రధాని ఈ సమావేశానికి ఆహ్వానించారు. జమిలి ఎన్నికలపై ప్రధాని మోడీ ఆధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తరువాత ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. లాబీల్లో సమావేశం అనంతరం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురుచూస్తున్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ప్రధాని మోడీ ఎదురుపడి పలకరించారు. ‘విజయ్ గారూ..’ అంటూ సంబోధించి ఆయనతో మోడీ షేక్ హ్యండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నవ్వుతూ మాట్లాడారు.
ఒక ప్రాంతీయ పార్టీ ఎంపీని...ప్రధాని గుర్తించి మరి గౌరవంతో `గారు` అని మాట్లాడటం విజయసాయరెడ్డికి ప్రధానమంత్రి వద్ద ఉన్న వెయిట్కు గుర్తింపు అని పలువురు చర్చించుకుంటున్నారు. వైసీపీ కోసం నిరంతరం తపిస్తూ....పార్టీ అధినేత వైఎస్ జగన్కు కొండంత అండగాల ఉంటున్న నాయకుడిని జాతీయ స్థాయిలోనూ అదే గుర్తింపు దక్కుతోందని పేర్కొంటున్నారు.