ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు స్పీడును పెంచేశారు. ఎన్నికలకు ముందు మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన సొంతింటిలోనే వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం జమ్మలమడుగు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన వివేకా... తెల్లారేసరికంతా రక్తపు మడుగులో కనిపించడం నాడు పెను కలకలమే రేపిందని చెప్పాలి.

 

ఈ హత్యపై టీడీపీ - వైసీపీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో వివేకా హత్యకేసు దర్యాప్తు కోసమంటూ నాటి చంద్రబాబు సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించింది. ఓ వైపు సిట్ - మరోవైపు కడప ఎస్పీ నేతృత్వంలో దర్యాప్తుతో త్వరలోనే ఈ కేసు మిస్టరీ వీడిపోతుందన్న భావన వ్యక్తమైంది. అయితే ఓ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన సిట్... ఈ మిస్టరీని ఛేదించడంలో విఫలమైంది.

 

నెలలు గడుస్తున్నా కేసులో పురోగతి కనిపించలేదు. అదే సమయంలో తాజా ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించడం - జగన్ సీఎం కావడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ క్రమంలో మొన్నామధ్య వివేకా కూతురు తాడేపల్లి వచ్చి జగన్ తో భేటీ అయ్యారు. తన తండ్రి మర్డర్ మిస్టరీని చేధించాలని - నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె జగన్ ను కోరారు.

 

ఈ క్రమంలో ఈ విషయంపై దృష్టి సారించిన జగన్... చంద్రబాబు సర్కారు నియమించిన సిట్ తో ఉపయోగం లేదని - దాని స్థానంలో కొత్తగా మరో సిట్ ను వేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా కొత్త సిట్ ను ఏర్పాటు చేశారు. ముగ్గురు డీఎస్పీలు - ముగ్గురు సీఐలు - నలుగురు ఎస్సైలతో సహా మొత్తం 23 మందితో ఏర్పాటైన ఈ సిట్... ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిపోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: