చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఉంది ఏలూరు టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వైఖరి. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా దెందులూరు నియోజకవర్గంలో ఎన్నో అరాచకాలకు కేంద్ర బిందువుగా ఉన్న చింతమనేని ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఓడినా మాత్రం ఆగలేదు. తాజాగా ఆయనపై దొంగతనం కేసులో కేసు నమోదయింది. పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజీ కి వెళ్లే పోలవరం కుడి కాలువ దెందులూరు నియోజకవర్గం నుంచి వెళుతుంది.
గతంలో ఈ నియోజకవర్గానికి చెందిన రైతులు చందాలు వేసుకుని పైపులు ఏర్పాటు చేసుకుని కాలువ నీటిని తమ పొలాలకు మళ్లించి కొనేవారు. ఈ ఎన్నికల్లో చింతమనేని ఓడిపోవడంతో పైపులను రాత్రికి రాత్రే ఆయన అనుచరులు చోరీ చేసి వాటిని తీసుకువెళ్లి చింతమనేని పొలంలో పెట్టేశారు. మూడేళ్ల క్రితం ఈ పైపులు ఏర్పాటు చేయడానికి చింతమనేని ప్రభాకర్ కొంతవరకు సాయం చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి పైపులు పెట్టి రైతులు నీటిని పొలాలకు మళ్లించి ఉన్నారు.
ఈ పైపుల ద్వారా దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు - పెదవేగి - ఏలూరు రూరల్ మండలాల్లోని గ్రామాలకు సాగునీరు అందిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన అక్కసుతో ఉన్న చింతమనేని సోమవారం అర్థరాత్రి తన అనుచరులను పంపి... ఈ పైపులు మేమే ఇచ్చాం... చింతమనేని తీసుకురమ్మన్నారంటూ పైపుల్ని తీసేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళన చేయడంతో పాటు మా పైపులను మాజీ ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులు చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చింతమనేనితో సహ మరో ఐదుగురిపైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో తనకు ఓట్లేయని వారిపై చింతమనేని చిందులు స్టార్ట్ చేసేశారట. తన దగ్గర పనులు చేయించుకుని తనకే ఓట్లు వేయరా ? నాకు టైం వచ్చినప్పుడు మీ అంతు చూస్తానని బెదిరింపులకు దిగుతున్నట్టు తెలుస్తోంది.