నటుడు పృథ్వి రాజ్ ను లేటెస్ట్ అల్లు అర్జున్ సినిమా నుంచి తప్పించునట్లు వార్తలు వస్తున్న సంగతీ తెలిసిందే. దీనితో ఈ వ్యవహారం వైసీపీ నాయకత్వం దగ్గరికి చేరింది. అయితే ఇటీవల పృధ్వీని తన సినిమాలోకి త్రివిక్రమ్ తీసుకోవడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. అదే విధంగా నిర్మాణ సంస్థలు గీతా-హారిక హాసినికి కూడా పవన్ తో మాంచి సాన్నిహిత్యం, బంధాలు వున్నాయి. అందుకే ఎందుకొచ్చిన సమస్య అని సైలెంట్ గా పక్కన పెట్టినట్లు బోగట్టా.


సాధారణంగా ఏదైనా సినిమాలో కాస్త మంచి నటుడికి పాత్ర వుంటే, ముందుగా దర్శకుడే చెబుతారు. తరువాత యూనిట్ జనాలు టచ్ లోకి వెళ్లి, డేట్ లు, షెడ్యూళ్లు ఇతరత్రా వ్యవహారాలు డిస్కస్ చేస్తారు. మరి తివిక్రమ్ చెప్పకుండానే పృధ్వీ తనకు ఆ సినిమాలో పాత్ర వుందని చెప్పారు అని అనుకోవడానికి లేదు. మరి ఇప్పుడు పాత్ర లేదూ అంటే ఏమయినట్లు? ఇదిలావుంటే ఢిల్లీలో ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాత ఆంధ్రకు చెందిన కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడుతున్నపుడు పృధ్వీ విషయం వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి దగ్గర ఇండస్ట్రీతో సంబంధాలు వున్న ఒకరు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


'వైకాపాకు ప్రచారం చేస్తే సినిమాల్లోంచి తప్పిస్తారా? అధికారంలో లేనపుడు ఎవ్వరు ఎలా ట్రీట్ చేసినా సహించాం, ఇప్పుడు సరైన పాఠం చెబుతాం' అని విజయసాయి రెడ్డి కామెంట్ చేసినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇండస్ట్రీ జనాలను ఇరుకున పెట్టాలంటే ప్రభుత్వం ఏమీ చేయనక్కరలేదు. థియేటర్ల దగ్గర లెక్కలు పక్కాగా వుండేలా చూసుకుని, టాక్స్ లు పక్కాగా వసూలు చేస్తే చాలు అని నిర్మాత నట్టి కుమార్ పదే పదే చెబుతుంటారు. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ లొసుగులు, ఇండస్ట్రీలో లూప్ హోల్స్ అన్నీ పార్టీకి నివేదికగా ఇచ్చే ఆలోచనలో వున్నట్లు బోగట్టా. పృధ్వీ కూడా ఇండస్ట్రీ వ్యవహారాలు సిఎమ్ దృష్టి తెస్తామనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: