తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఎంపీలు ఆ పార్టీకి గుడ్బై చెప్పేయనున్నారు. అంతేకాకుండా తమకు ప్రత్యేక సభ్యులుగా గుర్తించాలని కోరనున్నారు. తెలుగుదేశం పార్టీని వీడనున్న ఆ ఎంపీలు...బీజేపీలో చేరనున్నారు. ఈ ఆపరేషన్ తెరవెనుక ఇప్పటికే పూర్తికాగా...ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా బయటపడనుంది. ఈ ఆపరేషన్కు నాయకత్వం వహిస్తోంది....ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమ్మినబంటు, బీజేపీ ఎంపీ అమిత్ షా.!
తెలుగుదేశం పార్టీలోని పరిణామాలను విశ్లేషిస్తూ..టీడీపీని వీడే యోచనలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎంపీలు సుజనా, సీఎం రమేష్, గరికపాటి, టిజి వెంకటేష్. తమను ప్రత్యేక గ్రూప్ కు ప్రరిగణించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి లేఖ అందజేయనున్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికే రాజ్యసభలో ప్రధాని మోడీ, అమిత్ షా తో నలుగురు టీడీపీ ఎంపీలు మాట్లాడినట్లు సమాచారం. ఏ క్షణంలోనైనా రాజ్యసభ చైర్మన్కు లేఖ ఇచ్చేందుకు ఎంపీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది టీడీపీ ఎంపీలను బీజేపీతో అనుబంద సభ్యులుగా చేర్చుకునేందుకు అమిత్ షా పథకం వేసినట్లు సమాచారం.
నలుగురు ఎంపీల బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అమిత్ షా అప్పగించినట్లు సమాచారం. మిగిలిన ఇద్దరు ఎంపీలను కూడా టీడీపీ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఎంపీలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా, తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు కూడా తమతో టచ్ లో ఉన్నట్లు బీజేపీ నేతలు వెల్లడించడం కలకలం రేకెత్తిస్తోంది. ఇదిలాఉండగా, టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుకు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళ్లే సమయంలో బీపీ తగ్గిపోవడంతో.. అకస్మాత్తుగా ఆయన కిందపడిపోయారు. ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్ గరికపాటికి సపర్యలు చేసి, వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు.