ఆంధ్రప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పెను సంక్షోభంలో చిక్కుకుంది. ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ్ముడు ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ రాజ్యసభ చైర్మన్ కు లేఖ ఇచ్చారు. మరోవైపు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఇలా రోజంతా చకచక పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశాల నుంచి స్పందించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఆయన పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. తెలుగుదేశం పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని శ్రేణులకు అభయము ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలను తమ వైపు లాక్కునేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రత్యేక హోదా కోసమే బిజెపితో పోరాడినట్టు చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధైర్య పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.
అయితే ఈ చంద్రబాబు స్పందన కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మీడియా గ్రూపులకు ఫార్వర్డ్ అయ్యింది తప్ప.. ఈ విషయాన్ని ఏ నాయకుడు కూడా మీడియా ముందు చెప్పలేదు.