ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కాకుండానే టీడీపీలో ముసలం ముదిరి పాకాన పడుతుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ.... అటు ఢిల్లీలోనూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు టిడిపి అధినేత చంద్రాబును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తాజా పరిణామాలు చూస్తుంటే టీడీపీలో సంక్షోభం తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో చంద్రబాబు ఎన్టీఆర్ణు గద్దె దింపి నప్పుడు పార్టీ ఎంత సంక్షోభాన్ని ఎదుర్కొందో.... ఇప్పుడు అంతకు మించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంతో పాటు పార్టీ ఏపీలో తిరిగి బతికి బట్ట కడుతుందా ? అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి.
ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరుతున్నట్టు చెప్పేశారు. ఉప రాష్ట్రపతిని కలిసి లేఖ కూడా ఇచ్చారు. ఇక టిడిపి నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో పది మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని జగన్ స్వయంగా ప్రకటించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే జగన్ ఓకే చెప్పాలే గాని.. ఇప్పటికిప్పుడే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని ప్రకటించారు. బుధవారం చంద్రబాబు ఫ్యామిలీతో సహా విదేశీటూర్కు వెళ్లిన సంగతి తెలిసిందే.
టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లాంటి నేతలతో ఆయన ఫోన్ టచ్ లోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని తెలుస్తోంది. ఈ సంక్షోభం నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేల్లో ధైర్యం చెప్పేందుకు చంద్రబాబు తమ పార్టీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలకు అక్కడ నుంచే ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా... 15 మంది ఎమ్మెల్యేలు అసలు స్పందించలేదని తెలిసింది. దీంతో వీరిలో కొందరు వైసీపీలోకి.... మరికొందరు బిజెపిలోకి వెళ్లిపోవచ్చని టిడిపి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ వార్త ఇప్పుడు టిడిపి సర్కిల్స్ లో టెన్షన్ టెన్షన్ గా మారింది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు బాబుతో టచ్లో ఉండేందుకు కూడా ఇష్టపడడం లేదు అంటే... వీరిలో కనీసం 10 మంది అయినా గోడ దూకేస్తారని అంటున్నారు. అప్పుడు టీడీపీకి 10-13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. ఇదే జరిగితే వచ్చే 5 ఏళ్లలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుందోనన్న టెన్షన్ ఆ పార్టీని వెంటాడుతోంది.