సంవత్సరం క్రితం వరకు తెలుగు మీడియా మొత్తం వైకాపాకు వ్యతిరేకంగా పనిచేసింది. తెలుగు మీడియాలో వైకాపా నేతల గురించి పెద్దగా ప్రచారం ఉండేది కాదు. ఎలాగో వచ్చే ఎన్నికల్లో టిడిపి గెలుతుందని నమ్మకంతో అంతా టిడిపికే మద్దతు ఇస్తూ వచ్చారు. కానీ, ఎన్నికల తరువాత అంతా మారిపోయింది.
ఎవరు ఊహించని విధంగా వైకాపా విజయం సాధించింది. 175 స్థానాలకు గాను వైకాపాకు 151 స్థానాలు కట్టబెట్టారు ప్రజలు. ఈ స్థాయిలో వైకాపాకు ప్రజలు మద్దతు ఇస్తారని అనుకోలేదు. ఇది మాములు విషయం కాదు. ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్ ప్రజలను కోరడం వలన ఇలా అవకాశం ఇచ్చారని అనుకున్నారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కదా పెద్దగా అనుభవం లేదు కదా.. అసెంబ్లీలో అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తారో అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తెలుగుదేశం పార్టీ నేతలు గట్టి ప్రశ్నలను రెడీ చేసుకొని వైకాపాను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నం చేసింది. కానీ, వైకాపా నేతలు టిడిపికి ఆ అవకాశం ఇవ్వలేదు.
అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాదు.. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతూ దానివలన ప్రభుత్వం, ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో స్పష్టంగా చెప్పడం విశేషం. గత ప్రభుత్వం చేసిన తప్పులపై అంబటి రాంబాబు, కోటంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లు మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో టిడిపికి చుక్కలు చూపించడం ఖాయమే అనిపిస్తోంది.