రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ స్థితి ఎటు తిరిగినా తిరగొచ్చు! నిన్న మొన్నటి వరకు అంటే ఖచ్చితంగా ఆరు మాసాల ముందు వరకు కూడా బీజేపీని ఆడిపోసుకున్న టీడీపీ ఎంపీలు సుజ నా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్రావులు తాజాగా కమలం గూటికే చేరిపోయారు. నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై సుజనా, కడప ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం రమేష్ పెద్ద ఎత్తున బీజేపీపై దుమ్మెత్తి పోశారు.
ఇక, ఇప్పుడు చల్లగా పార్టీ నుంచి జారుకున్నారు. ఇక, ఇదే విషయంపై జరుగుతున్న చర్చలో విజయవాడ నుంచి జగన్ సునామీని సైతం అడ్డుకుని విజయం సాధించిన ఎంపీ కేశినేని నాని పేరు కూడా బాహాటంగానే వినిపిస్తోంది. ఆయన కూడా ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉన్నారనే విషయం వాస్తవం. టీడీపీలోనే ఉంటున్నా సోషల్ మాధ్యమాల వేదిక గా మాత్రం రెచ్చిపోయారు. టీడీపీలోని కీలక నేతలను సైతం టార్గెట్ చేసుకుని వ్యాఖ్యలు సంధించారు. దీంతో కేశినేని నాని పార్టీ మారుడు ఖాయమని అందరూ అనుకున్నారు.
అయితే, ఆయన మాత్రం చంద్రబాబు వైసీపీలోకి వెళ్తే.. తాను కూడా టీడీపీ నుంచి మరో పార్టీలోకి వెళ్తానని అప్పట్లో అందరి నోర్లూ మూయించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, వేగం పెంచిన కమలం పార్టీ దూకుడు నేపథ్యంలో ఇక, నాని వంతు కూడా దగ్గరకు వచ్చిందనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ విష్ణువర్థన్ మాట్లాడుతూ.. రాబోయేరోజుల్లో టీడీపీ ఖాళీ అవుతుందని చెప్పిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అతి కష్టం మీద ముగ్గురు ఎంపీలను దక్కిం చుకున్న టీడీపీ.. వారిని నిలబెట్టుకుంటుందా? అనే ప్రశ్న తెరమీదికి వస్తోంది. అయితే, ముగ్గురు ఎంపీల్లో ఒక్కరు మాత్రం నికరంగా నిలబడతారు. ఆయనే శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఈయనకు పెద్దగా వ్యాపారాలు, వ్యవహారాలు ఏమీలేవు. కానీ, మిగిలిన ఇద్దరు గల్లా జయదేవ్కు, కేశినేనినాని(ఇతర రాష్ట్రాల్లో ట్రావెల్స్ బిజినెస్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే అనుమతులకు అప్లై చేశారు) వ్యాపారాల్లో ఉన్నారు.
సో.. వీరిలో ఒక్కరినైనా తనవైపు తిప్పుకోవాలని భావిస్తున్న బీజేపీ .. ఖచ్చితంగా తనకు లొంగుతాడని భావించిన నానికి వల వేసింది. దీనికి ఆయన దాదాపు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఆయన కూడా సీఎం రమేష్ మాదిరిగానే కమల గూటికి చేరిపోవడం ఖాయమని తెలుస్తోంది. ఎంతైనా రాజకీయమన్నాక అంతేగా గురూ!!