టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖర రావు - కేసీఆర్ తన పార్టీలో ఊహించని రాజకీయ పోరు కొనసాగి ఊహించని రీతిలో అధికారం కోసం కుటుంబ సభ్యుల మద్య పోరాటం జరగగా — ఆ వారసత్వ పోరులో కెసీఆర్ మేనల్లుడు తన్నీరు హరీష్ రావుకు జరిగింది చాలా అన్యాయమనే ప్రజలు అంటున్నారు. దానికి ముఖ్యమంత్రి సెంటిమెంట్తో నో మరోరకంగానో "చెక్" పెట్టిన సంగతి తెలిసిందే. కొద్దికాలం క్రితం వారసత్వ పోరు తారాస్థాయికి చేరిందని, ఆ క్రమంలో హరీశ్ రావు వార్తలను తమకు అనుకూలంగా ఉండే మీడియాలో రాకుండా కేసీఆర్ చక్రం తిప్పారనే విషయం తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ అంతర్గత పోరు సద్దుమణగడం గులాబీ దళపతి తనయుడు కేటీఆర్, హరీశ్ రావు కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం, అనంతరం కేటీఆర్తో చాలెంజ్ చేసి మరీ, మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక ఆధిఖ్యత దక్కించు కోవడం తెలిసిన సంగతే. అయితే, తాజాగా హరీశ్ రావు మరో రూపంలో తెరమీదకు రాగా, బీజేపీ ఆయన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెద్దఎత్తున నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఈ కార్యక్రమానికి కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పనుల్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ మేనల్లుడు, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఎక్కడా అవకాశం దక్కలేదు. ఈ సంఘటన అన్ని రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోవ లక్ష్మణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్కరూపాయి ఇవ్వలేదని కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండి పడ్డారు. కేంద్రంలో, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాలు లేకుంటే కాళేశ్వరం ప్రాజక్టు సాధ్యమయ్యేదా? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టుకు అటవీ అనుమతులు ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపి ప్రభుత్వం అని, ఇదే విషయాన్ని అప్పుడు శాసనసభ సాక్షిగా కేసీఆర్, హరీష్ రావులు ప్రధాని నరేంద్ర మోదీని కీర్తించారని, ఇప్పుడు ప్రధానిని ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవటం బాధాకరమని లక్ష్మణ్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం చేసిందేమిటో కేంద్రమంత్రుల చుట్టూ తిరిగిన హరీష్ రావును అడిగితే తెలస్తుందని లక్ష్మణ్ అన్నారు. ప్రసుతం అతను ఎక్కడ కన్పించటం లేదని అన్నారు.కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉండి, కేసీఆర్ రామగుండం ఎరువుల కర్మాగారం కోసం కనీస ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు. ప్రభుత్వ ఏర్పడిన ఆరు నెలల తర్వాత కేబినేట్ మీటింగ్ ఏర్పాటు చేసి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా మిగతా అంశాలను ప్రస్తావించడం సరైన విధానం కాదన్నారు. నిరుద్యోగం, ఉద్యోగుల కు ఇచ్చిన హామీలు, ఆర్టీసీని ఆదుకోనేందుకు చర్యలు ఇవేవీ కనీసం క్యాబినెట్ లో చర్చించలేదన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయాలన్న ఆకాంక్ష ముఖ్యమంత్రికి లేదని లక్ష్మణ్ అన్నారు.