వర్షాకాలం వచ్చినా మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాష్ట్ర ప్రజలకు శుభవార్త. రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర వైపు వేగంగా రుతుపవనాలు కదులుతున్నాయి.
రుతుపవనాల రాకతో ఈరోజు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
రుతుపవనాల రాక కారణంగా రాగల నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రుతుపవనాల రాకతో వాతావరణం చల్లగా మారనుంది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గే సూచనలు ఉన్నాయి.
అత్యధికంగా40-42 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. ఇప్పటికే రుతుపవనాల రాక పదిహేను రోజుల వరకు ఆలస్యమైంది. ఉక్కపోతతో రాష్ట్రంలో అట్టుడుకుతోంది. ఇకనైనా కాస్త ఊరట కలుగుతుందని జనం ఆనందిస్తున్నారు.