తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిని దెబ్బ మీద దెబ్బ కొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాచుకుని కూర్చొని ఉంది. చంద్రబాబు ఏ మాత్రం కోలుకోకుండా ఉండేలా బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా పక్కా ప్లానింగ్తోనే బీజేపీ ముందుకు వెళుతున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ ఇప్పుడు ఏపీలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తోంది.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి తమ పార్టీలోకి వచ్చే వారికి పెట్టిన కండీషనే ఇప్పుడు ఏపీలో బీజేపీకి వరంగా మారనుంది. పార్టీ మారాలనుకునే వారు తమ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలో చేర్చుకోమని ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీకి శాసనసభలో చంద్రబాబుతో కలిపి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి.
అంటే టీడీపీ నుంచి మరో 5 గురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతే చంద్రబాబుకు ప్రధాన ప్రతిపక్ష అధినేత హోదా ఉండదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తోందట. అంటే వీరిలో 7-8 మంది పార్టీ మారినా చంద్రబాబుకు ప్రతిపక్ష అధినేత హోదా ఉండదు. పార్టీ మారిన టీడీపీ రాజ్యసభ సభ్యులు అడిగినట్లుగానే వీరు కూడా తమను ప్రత్యేకంగా గుర్తించాలని స్పీకర్ ను కోరే అవకాశం ఉంది.
అప్పుడు ఫిరాయింపులు చట్టం వీరికి వర్తించదు. అలా జరగాలంటే కనీసం 2 / 3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారాలి. ఫిరాయింపుల విషయంలో జగన్ చాలా కఠినంగా ఉండాలని ఆదేశించినట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఇక బీజేపీ ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకునే విషయంలో తాము రెడీగా ఉన్నామన్న విషయాన్ని బీజేపీ ఆంధ్రప్రదేశ్ నేత విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. అప్పుడు దీనిని బట్టి ఏపీలో టీడీపీని బీజేపీ ఎలా టార్గెట్ చేయబోతోందా ? అర్థమవుతోంది.