తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు రాకెట్ స్పీడ్ తో  విజయవంతంగా  పూర్తయ్యింది. మరికొన్ని గంటల్లో ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

 

గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు మరో అరుదైన ఘనతను సాధించింది. శంకుస్థాపన చేసిన తరువాత, అతి తక్కువ సమయంలో పనులు పూర్తయిన ప్రాజెక్టుగా కాళేశ్వరం, విన్నర్స్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్, కంట్రీ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. అత్యంత భారీ ప్రాజెక్టుగా, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు నేడు జాతికి అంకితం చేస్తున్నారు సీఎం కేసీఆర్.

 

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు గురించి భారత ముఖ్య సలహాదారు కొండవీటి మురళి ఓ ప్రకటన చేశారు. ప్రాజెక్టును నిర్మించిన నిర్మాణ సంస్థ 'మేఘా'తో పాటు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో భారీ మోటార్లను తయారు చేసి అందించిన బీహెచ్ఈఎల్ సైతం రికార్డులో చోటు దక్కించుకున్నాయని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే తెలంగాణ సర్కారుకు, మేఘా, బీహెచ్‌ఈఎల్‌ సంస్థలకు తెలియజేశామని అన్నారు.

 

ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వంద‌ల కిలోమీట‌ర్ల కాలువ‌లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో భాగంగా 13 జిల్లాల్లోని 18 ల‌క్ష‌ల 25 వేల ఎక‌రాల‌కు కొత్త‌గా నీరిస్తారని అధికారులు చెబుతున్నారు. దారి పొడ‌వునా ఉండే గ్రామాల‌కు, హైద‌రాబాద్‌కు తాగునీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు నీరు ఇవ్వాలనీ ప్రణాళిక రూపొందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: