ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టిందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. ఇక తాజాగా టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని వార్తలు వస్తున్నాయి. అందులో గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇప్పటికే 15మంది ఎమ్మెల్యేలతో టచ్లో ఉన్న గంటా.. వారందరితో త్వరలోనే కాషాయ కండువాను కప్పుకోనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఈ సమయంలోనే బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నుంచి తమ పార్టీలోకి మరిన్ని వలసలు ఉంటాయని అన్నారు.
నలుగురు ఎంపీలు బీజేపీ కండువా కప్పుకొన్న నేపథ్యంతో టీడీపీలో ఇప్పటికే కలవరం మొదలైన సంగతి తెలిసిందే.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి ప్రస్తుతం ఫారిన్ టూర్లో ఉన్నప్పటికీ... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందుతూ వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన.. శుక్రవారం సాయంత్రం టీడీపీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా టీడీపీ ఓవైపు తనను కాపడుకునే పనుల్లో బిజీగా ఉండగా....బీజేపీ నేతలు ఈ కలకలం రేకెత్తించే వ్యాఖ్యలు చేశారు.
ఆంద్రప్రదేశ్లోని చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ వైపు చూస్తున్నారని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఇందులో టీడీపీ నేతలు అధికంగా ఉన్నారని తెలిపారు. తమ పార్టీ విధివిధానాలు నచ్చే ఇతర పార్టీల నుంచి నేతలు బీజేపీలోకి వస్తున్నారని తెలిపారు. ఏపీలో కూడా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఆవిర్భవిస్తుందని తెలియజేశారు. బీజేపీ ఇచ్చే షాక్ నుంచి చంద్రబాబు తేరుకోవడం కష్టమన్నారు.త్వరలోనే ప్రముఖులు కొందరు పార్టీ మారనున్నారని జోస్యం చెప్పారు.