వ్యక్తిగత ప్రయోజనాల కోసం
చంద్రబాబునాయుడు డేంజరస్ గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. రాష్ట్రంలో జగన్మోహన్
రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేని కారణంగా పరోక్షంగా బిజెపి అండ దీసుకునేందుకు ప్లాన్
చేశారు. ఇందులో భాగంగానే ఆరుగురు రాజ్యసభ సభ్యుల్లోని నలుగురిని బిజెపిలోకి
పంపారు. ఈ విషయాన్ని స్వయంగా టిడిపి నేతలు
ఆరోపిస్తున్నారు.
ఇంతకీ చంద్రబాబు ఎందుకీ విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే, భవిష్యత్తులో జగన్ ను ఎదుర్కొనేంత సీన్ తనకు లేదన్న విషయం చంద్రబాబుకు బాగా అర్ధమైపోయింది. అందులోను కొడుకు లోకేష్ సామర్ధ్యం చాలామందికన్నా చంద్రబాబుకే బాగా తెలుసు. కాబట్టి భవిష్యత్ అవసరాల కోసమే చంద్రబాబు ప్రమాదకరమైన క్రీడకు తెరలేపారు.
ఐదళ్ళ పాలనలో జరిగిన అవినీతిపై జగన్ విచారణ చేయిస్తున్నారు. అందులో అవినీతి జరిగిందనేందుకు చాలా ఆధారాలే బయటపడతాయని అధికారవర్గాలే చెబుతున్నాయి. విచారణ కమిటీలు రిపోర్టులు ఇవ్వటం బాధ్యులపై కేసులు పెట్టటమే మిగిలిందన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
తనతో పాటు కొడుకు, కీలక నేతలపై కేసులు పడకుండా, అరెస్టులు జరగకుండా ఉండాలంటే చంద్రబాబుకు కచ్చితంగా కేంద్రం అండ ఉండాల్సిందే. రాష్ట్రస్ధాయిలో ఎటూ రక్షణ తీసుకోవటం సాధ్యం కాదు కాబట్టే పార్టీ భవిష్యత్తును పణంగా పెట్టి బిజెపి ముందు పరోక్షంగా మోకరిల్లినట్లే కనబడుతోంది.
ఇపుడు చంద్రబాబు చేసిన పనివల్ల భవిష్యత్తులో టిడిపి కనుమరుగైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే టిడిపిలోని చాలామందిలో కేసుల భయం వెన్నాడుతోంది. కాబట్టి మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు, నేతల్లో చాలామంది బిజెపి వైపు చూస్తున్నారు. అదేగనుక నిజంగా జరిగితే ఇప్పటికిప్పుడు టిడిపి తుడిచిపెట్టుకుపోయి బిజెపి బలోపేతమవుతుంది.
తెలంగాణాలో టిడిపి పరిస్ధితి ఎలాగైపోయిందో వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుతం ఏపిలో కూడా పార్టీ పరిస్ధితి అలాగే తయారైపోతుందనటంలో సందేహమే అవసరం లేదు. చంద్రబాబు నెగిటివ్ పాలిటిక్స్ ప్లే చేసిన ఫలితం ఇంత దారుణంగా ఉండబోతోంది. చూడబోతే తొందరలోనే ఏపిలో కూడా జెండా పీకేయటం ఖాయమనే అనిపిస్తోంది.