ఎంఎల్ఎ, వైసిపి నాయకురాలు రోజా శుక్రవారం కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేశారు. తన భర్త సెల్వమణితో కలిసి ఆమె ఈ రోజు గృహ ప్రవేశం చేశారు. వైసిపి అధికారంలోకి రావడంతో ఎపి రాజధాని అమరావతికి సమీపంలో రోజా అద్భుతమైన హంగులతో కూడిన ఇంటిని కొనుగోలు చేశారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన రోజా ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో నగరిలో సొంతింటిని నిర్మించుకున్నారు. 2019లో కూడా వైసిపి ఎంఎల్ఎగా విజయం సాధించిన రోజా ఇప్పడు రాజధాని అమరావతికి సమీపంలో ఇల్లు కొనుగోలు చేశారు. ఈ క్రమంలో ఆమె శుక్రవారం గృహ ప్రవేశం చేశారు.
ఇదిలా ఉండగా ఎన్నికల్లో జగన్ హామీ ఇచ్చిన నవరత్నాలను చిత్తశుద్దితో అమలు చేసే బాధ్యతను రోజాకు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మితో కలిసి రోజా ఈ నవర్నతాలను పర్యవేక్షిస్తారని వైసిపి శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా స్పష్టత రాలేదు.
ఇటీవల వైసీపీ ఫైర్ బ్రాండ్ అయిన రోజా, అసెంబ్లీలో మాటల తూటాలు పేల్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పైన మాట్లాడిన రోజా, చంద్రబాబు లక్ష్యంగా పదునైన విమర్శలు చేసారు. మహిళలను అడుగడుగునా అవమానించిన నాటి పాలకులకు ప్రజలు బుద్ది చెప్పారని విరుచుకుపడ్డారు.