విజయవాడలోని ఉండవల్లి లో కృష్ణా కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన ఓ అత్యాధునిక భవనంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అవసరాల కోసం, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ కోసం ప్రజా వేదిక పేరుతో ఓ పెద్ద భవనాన్ని నిర్మించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక ప్రతిపక్ష నేత గా మారిపోయారు.
తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత కార్యాలయంగా గుర్తించాలంటూ చంద్ర బాబు జగన్ కి ఓ లేఖ రాశారు. కానీ చంద్రబాబు విజ్ఞప్తిని జగన్ మన్నించ లేదు. ప్రజా వేదికను ప్రభుత్వ అవసరాల కోసమే వాడాలని నిర్ణయించారు.
త్వరలో కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు వేదికగా ప్రజావేదికను నిర్ణయించింది.
ఇప్పటికీ ప్రజావేదికలోనే ఉన్న మాజీ సీఎం సామాగ్రిని తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీకి కబురుపంపింది. అయితే దీన్నిసానుభూతి అంశంగా మార్చుకోవాలని నిర్ణయించిన తెలుగుదేశం నేతలు కొత్త డ్రామా ప్రారంభించారు. చంద్రబాబు విదేశాల్లో ఉన్న సమయంలో ప్రజావేదికను ఎలా ఖాళీ చేస్తారంటూ కొత్త వాదన వినిపిస్తున్నారు.
అధికారులతోనూ టీడీపీ నేతలు వాగ్వాదానికి దిగుతున్నారు. తమ అధినేత సామాగ్రిని బయపడేశారని.. రౌడీల తరహాలో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని సానుభూతి డ్రామా ఆడుతున్నారు. ఈ మేరకు అనుకూల మీడియాలో వార్తలు వచ్చేలా జాగ్రత్తపడుతున్నారు.