ఇండోనేషియాలో భారీ అగ్నిప్రమాదం సంబవించడంతో 30 మంది దారుణంగా మరణించారు. ఉత్తర సుమత్రా ప్రావిన్స్ లోని బింజాయ్ నగరంలో ఉన్న ఓ అగ్గిపుల్లల ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
అయితే చనిపోయిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. అగ్నిప్రమాదం సంబవించిందని తెలియగానే అధికారులు హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఒక్కసారే ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు.
ఇక ఇండోనేషియాలోని దీవుల్లో ఎన్నో కర్మాగారాలు ఉన్నా సరైన భద్రతాపరమైన చర్యలేవీ తీసుకోరని విమర్శలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం రాజధాని జకార్తా సమీపంలో జరిగిన ఓ భారీ అగ్నిప్రమాదంలో 47 మంది సజీవదహనం అయిన విషయం తెలిసిందే.