టీటీడి బోర్డు చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.  ప్రముఖ తెలుగు చలన చిత్ర నిర్మాత దిల్ రాజు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియమితులయ్యే అవకాశాలున్నాయి.  వైవీ సుబ్బారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

దిల్ రాజు వెంకటేశ్వర స్వామి భక్తుడు. తన బ్యానర్ కు కూడా శ్రీవారి మీద భక్తితోనే దిల్ రాజు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ అని పెట్టుకున్నారు. తెలుగు చలనచిత్ర రంగంలో దిల్ రాజు విజయవంతమైన నిర్మాతగా పేరు పొందారు. అయితే, దిల్ రాజును టీటీడీ పాలక మండలి సభ్యుదడిగా నియమించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో సత్సంబంధాలు నెరుపుతున్న జగన్ కేటీఆర్ సూచనకు వెంటనే అంగీకరించినట్లు చెబుతున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడిగా నియమితులైతే దిల్ రాజు చిరకాల వాంఛ తీరుతుందని అంటున్నారు. ఇదిలావుంటే, టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి నియమితులు కావడం పట్ల తమిళనాడు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: