తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోలుగా ఉన్నవారందరూ కాళేశ్వ‌రం ప్రాజెక్టు గొప్ప‌త‌నం గురించి పొగుడుతూ సోషల్ మీడియాలో వరుస పెట్టి ట్వీట్లు మీద ట్వీట్లు చేస్తున్నారు. భూమ్మీద ఉన్న అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లో పెద్ద ప్రాజెక్ట్ గా ఉన్న కాళేశ్వరంపై ప్రశంసలు కురిపించడం ఎవరు తప్పు పట్ట‌రు. అయితే వీరు తెలంగాణ‌ సీఎం కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు కోసం తన వంతు కష్టపడిన తెలంగాణ మాజీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావును ఏ మాత్రం గుర్తు పెట్టుకో కాకపోవడం లేదు.


ముందుగా టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు నాగార్జున‌, ర‌వితేజ ఇద్ద‌రూ ఈ ప్రాజెక్టును ప్రారంభించినందుకు శుభాకాంక్ష‌లు చెప్పారు. నీరే ప్రపంచానికి జీవం. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభించినందుకు శుభాకాంక్షలు... ఇంత గొప్ప ప్రాజెక్టును నిర్మించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు అభినందనలు అని రవితేజ ట్విట్‌ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిన ఫోటో షేర్‌ చేశారు. అయితే ఈ ట్వీట్‌లో హ‌రీష్‌రావు పేరు ఎక్క‌డా లేదు.


మ‌రోవైపు ఈ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలో హ‌రీష్‌రావు లేక‌పోవ‌డంతో ప్ర‌తిప‌క్షాల నుంచి పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేసీఆర్ హ‌రీష్‌ను ప‌క్క‌న పెట్టేశార‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను బ‌ల‌ప‌రిచేలా వీరి మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని మీడియాలో కూడా ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ టైంలో నాగార్జు, ర‌వితేజ చేసిన ట్వీట్ల‌తో చాలా మందికి క‌డుపు మండిపోయింది. అస‌లు మీరు హ‌రీష్‌రావును ఎందుకు గుర్తుంచుకోరు.. ఆయ‌న ప్రాజెక్టు కోసం చాలా చేశార‌ని విమ‌ర్శించారు.


ఇక ఇప్పుడు మ‌హేష్‌బాబు వంతు వ‌చ్చింది. కాళేశ్వ‌రంపై మ‌హేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘‘విప్లవాత్మకం ఆదర్శం. ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించారు. ఇందుకు గానూ కొత్త టెక్నాలజీతో దీనిని రూపొందించిన ఇంజనీర్లకు హాట్సాఫ్. అలాగే తెలంగాణ సీఎంఓ కేటీఆర్ కు కంగ్రాట్స్’’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌లో కూడా మ‌హేష్ హ‌రీష్‌రావు పేరు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో ఇప్పుడు ఇండ‌స్ట్రీ జ‌నాల‌కు కేసీఆర్ ఆ త‌ర్వాత కేటీఆర్ ఒక్క‌రే క‌న‌ప‌డుతున్నార‌ని... అది కూడా వాళ్ల అవ‌స‌రాల కోస‌మే అన్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.


ఐదేళ్ల పాటు భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రిగా హ‌రీష్‌రావు తెలంగాణ‌లో ఎన్నో ప్రాజెక్టుల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ఈ క్రమంలోనే కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఆయ‌న పాత్ర అమూల్యం. అలాంటిది ఈ ప్రాజెక్టు ప్రారంభోత్స‌వం రోజునే కాదు... అంత‌కు ముందు నుంచే ఆయ‌న్ను క్ర‌మ‌క్ర‌మంగా ప‌క్క‌న పెడుతున్నార‌న్న చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. మ‌రి ఈ టైంలో టాలీవుడ్ హీరోలు కేసీఆర్‌, కేటీఆర్‌ భ‌జ‌న చేస్తున్నారే త‌ప్పా అందులో హ‌రీష్ క్రెడిట్ గుర్తించ‌లేదు. అందుకే సామాన్య జ‌నాలు ఇప్పుడు హీరోల‌పై విరుచుకుప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: